వనపర్తి: పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లా విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో జరిగిన జిల్లా జీహెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొని పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గణితం, ఆంగ్లం, సైనన్స్ పాఠ్యాంశాల స్టడీ మెటీరియల్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆగస్టు 12 నాటికి సంబంధిత ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక స్టడీ మెటీరియల్ పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని.. పరీక్షల ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని కోరారు. ఆయా విద్యార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ బలహీనతలను అధిగమించేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో వంట గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా వినియోగించి శుభ్రంగా, నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


