డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ తలపెట్టారు. బలిజిపేట కూడలిలో దివంగత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు కూటమి ప్రభుత్వంలో లేదా అని సీఐలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై నిగ్గుతేల్చాలంటూ నినదించారు. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


