● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
సూర్యనారాయణ
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ విధానాల కారణంగానే భీమసింగి చక్కెర పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. పరిశ్రమను ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఆరు దశాబ్దాలుగా వేలాది మంది రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి చక్కెర దిగుమతులు వంటి విధానాల వల్లే పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లిందని ఆరోపించారు. చెరకు కొరత వల్లే పరిశ్రమ మూతపడిందన్న వాదన సరికాదన్నారు. పరిశ్రమకు చెందిన విలువైన భూములు, ఆస్తులను విక్రయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. పరిశ్రమను పునరుద్ధరించి రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులు, ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.


