విజయనగరం క్రైమ్: దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, హక్కులను పరిరక్షించాలని దక్షిణ భారత బాప్టిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్.జాన్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వివక్షకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయనగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట కూడలి నుంచి మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం వీధి మీదుగా కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి వరకు ర్యాలీ సాగింది. మతం మారినంత మాత్రాన కులం మారదు, దళితులు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలు తొలగిపోవు అంటూ నినదించారు. మతం పేరిట దళిత ముస్లింలు, క్రైస్తవుల ప్రాథమిక హక్కులను రద్దుచేసే రాజ్యాంగ విరుద్ధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


