ప్లకార్డులతో
నిరసన
విజయనగరం: మహిళల భద్రత, రక్షణకోసం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం రద్దు నిర్ణయంపై మహిళలు భగ్గుమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ మహిళా భద్రత వ్యతిరేక పాలనపై నిరసన తెలిపారు. దిశ చట్టం రద్దుచేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేబినెట్లో తీసుకున్న దిశ చట్టం రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన అని నిలదీశారు. సీఎం డౌన్డౌన్ అంటూ నినదించారు. దిశ చట్టం రద్దు నిర్ణయ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఆడబిడ్డలకు రక్షణ కవచం లాంటి చట్టాన్ని రద్దు చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. దిశ చట్టం వచ్చిన తరువాత 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం వల్ల మహిళల్లో ధైర్యం పెరిగిందని, బాధిత మహిళలకు న్యాయం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలు మద్దతుగా చట్టాన్ని రద్దు చేస్తే మహిళాలోకం నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, మాజీ మేయర్ వి.విజయలక్ష్మి పాల్గొన్నారు.


