విజయనగరం గంటస్తంభం: జిల్లాలో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతిని పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నాలుగు లైన్ల రహదారి, ఓబెరాయ్–మేఫైర్ హోటళ్ల అనుసంధాన రహదారులు, పెందుర్తి–బౌడార ఎన్హెచ్–516బి, విజయనగరం–సంబల్పూర్, కొత్తవలస – విజయనగరం రైల్వే లేన్లు, తారకరామ తీర్థసాగరం, తోటపల్లి బ్యారేజ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించిన భూసేకరణ స్థితిగతులను సమీక్షించారు. భూ యాజమానులకు చట్టప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవార్డుల ప్రక్రియ, సర్వేలు, భూ రికార్డుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, శాఖల మధ్య సమన్వయంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసురావాలని సూచించారు.


