● గిరిజన పంచాయతీలే టార్గెట్
● పనులు చేయకుండానే స్వాహా
● రూ.18 లక్షల వరకు పక్కదారి
వీణల తయారీ కేంద్రంలో ఉన్న పనస కలప
సాక్షి, పార్వతీపురం మన్యం: సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత గిరిజన పంచాయతీల్లో కనీస పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు జరిగిన దాఖలాల్లేవు. ఇదే సమయంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు.. తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి మళ్లిపోతున్నాయి. వారి సొంత జేబులో సొమ్ములా వాడేసుకుంటున్నారు. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో గల గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కొద్ది రోజుల కిందట డ్రా చేసినట్లు సమాచారం. సాలూరు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా చేసినట్లు భోగట్టా. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలనే ఇందుకు ఎంచుకున్నారు. పనులు చేయకుండా నిధులు డ్రా చేయడం పట్ల తాము ఇరకాటంలో పడిపోతామేమో అని ఆయా కార్యదర్శులు ఆందోళనలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు కావడం.. మండల అధికారుల సిఫార్సులు కూడా ఉండడంతో నోరు మెదపలేక పోతున్నారు. ఇప్పుడు ఆయా పంచాయతీల్లో నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని తెలుస్తోంది.
గిరిజన పంచాయతీలే అధికం..
నిధులు డ్రా చేసిన పంచాయతీల్లో ఎక్కువ భాగం గిరిజన, గిరి శిఖర ప్రాంతాలే ఉన్నాయి. అది కూడా గతంలో వైఎస్సార్ సీపీ సర్పంచ్లు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీలనే ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భాగోతం బయట పడినా నిందను వారి మీదకు నెట్టేయవచ్చన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చని గ్రామస్తులు అంటున్నారు. ఈ పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఉన్నప్పటికీ ప్రశ్నించలేని పరిస్థితిలో వారు ఉండటం ఆ ‘తమ్ముడికి’ కలిసి వచ్చింది. కొత్తవలస పంచాయతీ నుంచి రూ.2,00,364, కందులపథం పంచాయతీ నుంచి 1,00,300, తోణాం రూ.1,49,978, సారిక రూ.2,00,482, మరిపల్లి రూ.1,00,300, కురుకుట్టి 2,50,750, అన్నంరాజువలస రూ.2,49,216, తుండ రూ.2,00,010, గంజాయిభద్ర రూ.లక్ష, పట్టుచెన్నూరు రూ.1.50 లక్షలు, కూర్మరాజుపేట రూ.50,622, కొదమ నుంచి రూ.1.20 లక్షల చొప్పున నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ 12 పంచాయతీల్లో రూ.18 లక్షలు విత్ డ్రా కావడం.. మెజారిటీ పంచాయతీలు గిరిజన ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. పాచిపెంట మేజర్ పంచాయతీలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసమని మంత్రి అనుచరుడి పేరు మీద రూ.లక్ష రూపాయల నిధులు డ్రా చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.


