● అధికారులకు తెలిసినా పట్టనట్లు
వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు
● నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే
మామూళ్ల కోసం మౌనం
నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు
విజయనగరం ఫోర్ట్:
ఇది ఈ ఇద్దరు రోగులకు వచ్చిన సమస్యే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోంది. చర్యలు చేపట్టాల్సిన ఆరోగ్యశ్రీ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది అధికారులకు చెబితే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలని ఓ అధికారి సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా కమర్షియల్గా మార్చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రస్టు ఇచ్చే నిధులతో పాటు అదనంగా కూడా రాబట్టుకునే పనిలో నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరిగిన కో పేమెంట్స్
ఆరోగ్యశ్రీ పథకంలో కో పేమెంట్స్ బాగా పెరిగినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదనపు వసూళ్లకే కో పేమెంట్స్ అని నెట్వర్క్ ఆస్పత్రులు పేరు పెట్టాయి. కో పేమెంట్ లేకుండా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స గాని, శస్త్రచికిత్సలు చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విషయం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు ఇచ్చే మామ్మూళ్ల కోసం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రోగుల నుంచి నెట్వర్క్ ఆస్పత్రుల అదనపు వసూళ్లుకు అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చీపురుపల్లికి చెందిన ఓబాలుడికి హైడ్రాసిల్ నొప్పి రావడంతో విజయనగరం పట్టణంలోని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రిలో చూపించగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో ఇన్పేషేంట్గా చేర్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాలుడికి శస్త్రచికిత్స చేశారు. అయినప్పటికీ అదనంగా మరో రూ.8 వేలు బాలుడి కుటుంబ సభ్యుల దగ్గర ఆస్పత్రి సిబ్బంది తీసుకున్నారు.
ఉచితంగా వైద్య సేవలు అందించేలా చూడాలి
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించే ప్రతినెట్వర్క్ ఆస్పత్రిలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వారిని పర్యవేక్షించేందుకు టీమ్ లీడర్లు కూడా ఉంటారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందేవిధంగా చూడాల్సింది వారే. ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందే ప్రతిరోజూ రోగుల దగ్గరకు వెళ్లి వైద్య సేవల గురించి ఆరా తీయాలి. అదేవిధంగా డబ్బులు ఎవరైనా తీసుకుంటున్నారా? అని రోగులనుంచి ఆరా తీయాలి. అయితే ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు, ఉన్నప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రులు అదనపు వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్ద పడిపోవడంతో కాలు విరిగింది. దీంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల్లో అ వ్యక్తికి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది ఆపరేషన్ చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ రూ.50 వేలు అదనంగా అవుతుందని చెప్పడంతో అంత ఇచ్చుకోలేమని చెప్పి, మరో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కూడా రూ.15 వేల వరకు అదనంగా ఇవ్వాలని చెప్పారు. దీంతో ఆ ఆస్పత్రిలో ఆ వ్యక్తిని చేర్పించారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి రోగికి నెట్వర్క్ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యసేవలు అందించాలి. అదనంగా డబ్బులు అడినట్లయితే సంబంధిత ఆస్పత్రి మిత్రాకుగాని, నాకు గానీ లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. డాక్టర్ కె. సాయిరాం,
ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్


