వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా శనివారం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. గత కొంత కాలంగా ఖరీఫ్ సీజన్కు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 24,788 ఎకరాల ఆయకట్టు భూములకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయకట్టుకు నీటి అవసరం ఉండడంతో మరో 200 క్యూసెక్కుల నీటిని పెంపుదలచేసి మొత్తం 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ నితిన్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 61.96 మీటర్లు లెవెల్ నీటిమట్టం ఉందన్నారు.
కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ
● ప్రజలు సురక్షితంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు
విజయనగరం గంటస్తంభం: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న వాహనాల రాకపోకలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి స్వయంగా పర్యవేక్షించారు. సుమారు గంటపాటు అక్కడే ఉండి ఈఎంఎస్ వ్యవస్థతో వాహనాల కదలికలను పరిశీలించారు. ప్రధాని పర్యటనకు వచ్చిన 4,860 బస్సుల్లో ప్రయాణించిన ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, సెర్ప్ డైరెక్టర్(అడ్మిన్) ఎ.కల్యాణ్ చక్రవర్తితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రజలకు ఎస్పీ కృతజ్ఞతలు
విజయనగరం టౌన్: అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ముగించినందుకు జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్శాఖ ముందస్తు ప్రణాళికతో చేపట్టిన భద్రతా, బందోబస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయన్నారు. జాతీయ రహదారిపై కాసేపు వాహనాల రద్దీ ఏర్పడినప్పటికీ అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా స్పందించి ట్రాఫిక్ను త్వరితగతిన సాధారణ స్ధితికి తీసుకువచ్చారన్నారు. బందోబస్తు విధులను అత్యంత క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఎయిర్పోర్టుకు శంఖారావం చేసిన కోడూరు వాసి
బాడంగి: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన యోగా శిక్షకుడు కడిమిశెట్టి రమేష్కు అరుదైన అవకాశం లభించింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శనివారం తొలుత శంఖానాదం చేశారు. విజయనగరం డిప్యూటీ కలెక్టర్ శర్మ సూచనల మేరకు ప్రధాని మోదీ పాల్గొన్న సభాస్థలి వద్ద శంఖారావంపూరించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు రమేష్ తెలిపారు.


