● ప్రతినెలా జీతం నుంచి కట్చేస్తున్నా పీఎఫ్ ఖాతాలో జమకాని వైనం
● జిల్లాలో పనిచేస్తున్న 85 మంది
ఆరోగ్యమిత్రలు
విజయనగరం ఫోర్ట్:
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్వైద్య సేవ) పథకంలో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రల పీఎఫ్ నిధులపై గందర గోళం నెలకొంది. వారి ఖాతాలకు జమ కావాల్సిన పీఎఫ్ నిధులు జమకాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వారికి జీతాలు జమచేసే ఏజెన్సీ నెలల తరబడి పీఎఫ్ ఖాతాకు నిధులు జమచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం తెలిసినా ఆరోగ్యశ్రీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోగ్య మిత్రలు ఆరోపిస్తున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకంలో 85 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెల వారి జీతం నుంచి పీఎఫ్ నిమత్తం రూ.1800 కట్ అవుతుంది. దీనికి తోడు ఏజెన్సీ మరో రూ.550 వేయాలి. మొత్తంగా ప్రతినెలా రూ.2,350లు పీఎఫ్ ఖాతాలో జమకావాలి. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఆరోగ్య మిత్రల ఖాతాల్లో పీఎఫ్ నిధులు జమకావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఐదు నెలలకు సంబంధించి ఒక్కో ఆరోగ్యమిత్రకు రూ.11,750 చొప్పున 85 మందికి మొత్తంగా రూ.9.98 లక్షలు వరకు జమచేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తుండడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఆరోగ్య మిత్రలకు పీఎఫ్ డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడం లేదని తెలిసింది. ఎవరెవరికి ఎన్ని నెలలు నుంచి జమకావడం లేదో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ కె.సాయిరాం,
ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్


