
విజయనగరం అర్బన్: వైఎస్సార్ పెన్షన్ కానుకల పంపిణీలో విజయనగరం జిల్లా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. నెలలో తొలిరోజు శనివారం 90.31 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేయడంతో జిల్లా ముందంజలో నిలిచింది. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీని వలంటీర్లు ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు.
జిల్లాలో 14 రకాల పెన్షన్లు 2,76,498 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, ఒక్కరోజులోనే 2,49,706 మందికి పంపిణీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ ఎ.కళ్యాణచక్రవర్తి తెలిపారు. కొత్తవలస, నెల్లిమర్ల అర్బన్లో 94 శాతం, విజయనగరం అర్బన్, విజయనగరం మండలంలో 93, రాజాం అర్బన్, బొబ్బిలి అర్బన్, గుర్ల మండలాల్లో 92, దత్తిరాజేరు, బొండపల్లి, డెంకాడ, ఎల్.కోట, తెర్లాం మండలాల్లో 91 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు వెల్లడించారు.