విశాఖ విద్య: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీస్ సర్కిల్ వద్ద భిక్షాటన చేస్తున్న ఇద్దరు చిన్నారులను పోలీసులు రక్షించి, సంరక్షణ గృహాలకు తరలించారు. గతంలో ఇదే ప్రాంతంలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న వారి తల్లిదండ్రులను మందలించినప్పటికీ, వారిలో మార్పు రాలేదని ఫోర్త్ టౌన్ సీఐ రాజేష్ తెలిపారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా తల్లిదండ్రులు పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న విషయం ఈస్ట్ ఏసీపీ దృష్టికి ఆదివారం రావడంతో, ఆయన ఫోర్త్ టౌన్ సీఐకు సమాచారం అందించారు. దీంతో బ్లూకోట్ పోలీసులు చిన్నారులు ఉన్న ప్రాంతానికి చేరుకుని ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం రెడ్క్రాస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ స్టేషన్కు చేరుకుని చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి సమక్షంలో బాలికను విశాఖ వేలీ బాలికల హోమ్కు, బాలుడిని ఆరిలోవలోని బాయ్స్ చిల్డ్రన్ హోమ్కు తరలించినట్లు సీఐ రాజేష్ తెలిపారు. జంక్షన్ల వద్ద చిన్నారులతో భిక్షాటన చేయిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.


