డాబాగార్డెన్స్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని జీవీఎంసీ అదనపు కమిషనర్లు పేర్కొన్నారు. ఆదివారం టంగుటూరి జయంతి సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, పి.నల్లనయ్య పలువురు అధికారులు పాల్గొని, టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో ప్రకాశం పంతులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, త్యాగనిరతి ఆయనకు ఆంధ్రకేసరిగా చిరస్థాయి గుర్తింపు తెచ్చాయన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్ కె.శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పద్మజ, సూపరింటెండెంట్ రియాజ్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


