పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
పీజీఆర్ఎస్లో
403 వినతుల స్వీకరణ
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 403 అర్జీలు అందగా.. జీవీఎంసీకి 64, రెవెన్యూ శాఖకు 30, పోలీసు శాఖకు 27, ఇతర శాఖలకు 282 ఉన్నాయి. అర్జీలను శాఖల వారీగా క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, అంతరశాఖల సమన్వయంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులకు ఎప్పటికప్పుడు పురోగతి వివరాలు తెలియజేయాలని సూచించారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ప్రజలకు లేకుండా అధికారులు సత్వరం స్పందించాలని, అలసత్వం, నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


