మహారాణిపేట: విశాఖ జిల్లాలో మంజూరైన ఐటీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను, కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో 27 ఐటీ కంపెనీల ప్రతినిధులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్ పురోగతి, వివిధ అనుమతులు, క్లియరెన్సుల పరిస్థితిని సమీక్షించారు. కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా మాట్లాడి, ఎదురవుతున్న సమస్యలు, పొందాల్సిన అనుమతుల వివరాలను తెలుసుకున్నారు. అక్టోబర్లో విశాఖలో ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు జరగనున్న నేపథ్యంలో అప్పటిలోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవో సంగీత్ మాథుర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, ఏపీఐఐసీ జెడ్ఎం సింహాచలం, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


