సీతంపేట: సామాజిక న్యాయం, సమానత్వం, సంక్షేమం కోసం జీవితాంతం అహర్నిశలు పోరాడిన మహనీయుడు ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు అర్పించేందుకు విశాఖలో భారీ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరేనాలో సంస్మరణ సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ముద్రగడ పద్మనాభం తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వమని, కాపు సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందిన ప్రజానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జిల్లాలోని అన్ని సామాజిక సంఘాల ఐక్యతతో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తోట రాజీవ్ తెలిపారు.ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, కాపు సమాజ హక్కుల పరిరక్షణ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలు చేపట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ పోస్టర్ను తోట రాజీవ్ ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాపు నాయకులు పీవీ సురేష్, కసిరెడ్డి సత్యనారాయణ, గుంటూరు నరసింహమూర్తి, వంగా ప్రభాకర్ రావు, గుడివాడ లతీష్, నవీన్, సుబ్బా విశ్వనాథ్, రాయుపు రెడ్డి అనిల్, కోసల శ్యామలదేవి, పండుగ్రి జయరాజు నాయుడు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


