డాబాగార్డెన్స్: జీవీఎంసీ నీటి దందాకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. ఇకపై ఆన్లైన్లో లేదా అధికారికంగా బుక్ చేసుకున్న వినియోగదారులకే జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులు జీవీఎంసీకి నామమాత్రపు రుసుము చెల్లించి నీటిని తీసుకెళ్లి, ప్రజల నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. టీఎస్ఆర్ కేంద్రాల్లో సామాన్య ప్రజలను పక్కనబెట్టి ప్రైవేట్ ట్యాంకర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ‘సాక్షి’ బుధవారం ‘నీటి దందా’ శీర్షికతో కథనం ప్రచురించడంతో స్పందించిన అధికారులు ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరాను నిలిపివేశారు. అధికారిక బుకింగ్లకే నీటిని అందించడం ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్ కేంద్రాల వద్ద ప్రైవేట్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. తమకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ధర్నాకు దిగారు.


