ఆరిలోవ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఆరిలోవలోని పి.వి.సింధు షటిల్ అకాడమీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో గంటన్నర పాటు గడిపిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, కార్యక్రమం పక్కనే ఉన్న తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించకపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని అతిపెద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒకటైన ఈ పాఠశాలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో హైస్కూల్ ప్లస్ కూడా మంజూరైంది. అలాంటి పాఠశాలను విద్యాశాఖ మంత్రి సందర్శించి, విద్యా బోధన, మౌలిక వసతులు, సమస్యలపై ఆరా తీసి ఉంటే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తే అక్కడి లోటుపాట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లేవని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను పక్కనపెట్టి ప్రైవేట్ అకాడమీ కార్యక్రమానికే పరిమితమయ్యారని, ప్రభుత్వ విద్యపై అదే స్థాయిలో శ్రద్ధ చూపలేదని కొందరు స్థానికులు విమర్శిస్తున్నారు.


