జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ
కార్యదర్శి సన్యాసినాయుడు
విశాఖ లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు రాజీ చేసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ఆధ్వర్యంలో గురువారం 30 రోజుల మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ విధానం సమర్థవంతమైన మార్గమని తెలిపారు. క్రిమినల్ కేసులు మినహా చాలా వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బి.తులసీదాసు, న్యాయవాదులు, న్యాయ సేవా ప్రాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


