డాబాగార్డెన్స్: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కళాశాలల బంద్లో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వద్ద ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విశాఖ విభాగ కన్వినర్ నితిన్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం.77ను రద్దు చేయడంతో పాటు డిగ్రీ సహా అన్ని కోర్సుల ప్రవేశ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ప్రసాద్, నగర కార్యదర్శి ధనుష్, రాష్ట్ర కమిటీ సభ్యులు చందు, లక్ష్యత్, చరణ్, నిఖిల్తో పాటు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.


