తాటిచెట్లపాలెం: వర్షాకాలంలో రైల్వే జోన్ పరిధిలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేషన్లు, యార్డులు, రైల్వే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీఎం ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాలని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలని, నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ బలమైన, స్పష్టంగా కనిపించే బారికేడ్లు ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ప్రిన్సిపల్ హెడ్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


