అల్లిపురం: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ కమిషనరేట్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భద్రతా ఏర్పాట్లలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఏపీ డీజీపీ హరీష్కుమార్ గుప్తా, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.


