మహారాణిపేట: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కేజీహెచ్తో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేజీహెచ్లో ప్రత్యేకంగా 6 పడకల వార్డు సిద్ధం చేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో మందులు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచారు. పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో రెండు ప్రత్యేక పడకలు, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్లలో ఐస్ ప్యాక్లను సిద్ధం చేశారు.
వడదెబ్బ లక్షణాలు గుర్తించండి ఇలా..
శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు, మగత నిద్ర, కలవరింతలు లేదా ఫిట్స్ రావడం వడదెబ్బ ప్రధాన లక్షణాలు. ఇలాంటి పరిస్థితిలో రోగిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి, తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి.


