విశాఖ లీగల్: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను నివారించడంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఆర్.సన్యాసినాయుడు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా, డివిజనల్ స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, మాన్యువల్ స్కావెంజర్ నిరోధక చట్టంపై శుక్రవారం జిల్లా కోర్టులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపినా, దాడులకు పాల్పడినా చట్టప్రకారం కఠిన శిక్షలు తప్పవని ప్రజలకు తెలియజేయాలన్నారు. భూ వివాదాలు, అసైన్డ్ భూముల సమస్యలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయని, అటువంటి విషయాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు. డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ.. బాధితులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలోనూ, సకాలంలో ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించడంలోనూ రెవెన్యూ శాఖ తక్షణమే స్పందిస్తుందని హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పౌర హక్కుల చట్టం, అట్రాసిటీ చట్టంలోని నిబంధనలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతి, మాజీ పీపీ ఎస్.ఎస్.ఎస్.వాసులు కేసుల విచారణలో ఎదురయ్యే సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఇన్చార్జి ఆర్డీవో శేషశైలజ, ఏసీబీ ప్రతినిధి అంబేడ్కర్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారాయుడు, చొక్కాకుల రాంబాబు, కల్పన, సుజాత, జోసెఫ్, ఆంజనేయులు తదితరులు పాల్గొని వివిధ కేసుల పురోగతిపై చర్చించారు.
న్యాయమూర్తి సన్యాసినాయుడు


