హాట్‌కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు | Sakshi
Sakshi News home page

హాట్‌కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు

Published Sat, Nov 18 2023 12:26 AM

టికెట్లు పొందిన  ఆనందంలో..  టీ–20 టికెట్ల కోసం భారీ క్యూలో అభిమానులు - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖలో వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్‌–ఆస్ట్రేలియా టీ20 తొలి మ్యాచ్‌ టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఏసీఏ ఆధ్వర్యంలో పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాన్ని ముగించగా శుక్రవారం ఐదు వేల టికెట్లను ఆరు డినామినేషన్లలో కౌంటర్ల ద్వారా విక్రయించారు. వైఎస్సార్‌ స్టేడియంతో పాటు టౌన్‌ కొత్తరోడ్‌, గాజువాకల్లోని మున్సిపల్‌ స్టేడియాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించారు.

కనీస ధర రూ.600 నుంచి గరిష్ట ధర రూ.6000లో పాటు రూ.1500, రూ.2000,రూ.3000,రూ.3500లు టికెట్లను మూడు ప్రాంతాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్‌ స్టేడియం బి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయాన్ని ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి పరిశీలించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా పొందిన టికెట్లను స్టేడియంలో ప్రవేశానికి ఫిజికల్‌ టికెట్లుగా మార్చుకునేందుకు ఆయా సెంటర్లలోనే 22వ తేదీవరకు అవకాశం కల్పించగా మ్యాచ్‌ జరిగే రోజు ఈనెల23న స్టేడియంలోనూ టికెట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో శనివారం సైతం ఆరు డినామినేషన్లలో టికెట్లను ఆయా కౌంటర్ల ద్వారా విక్రయించనున్నామని తెలిపారు.

1/1

Advertisement
Advertisement