అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ వస్తుంది... | - | Sakshi
Sakshi News home page

అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ వస్తుంది...

Sep 11 2023 1:32 AM | Updated on Sep 16 2023 5:12 PM

- - Sakshi

యువకుడు తన ఫోన్‌లో శ్రీఅమ్మా నన్ను క్షమించు.. నిన్ను బాగా చూసుకుందామనుకున్నాను. అయితే ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి.

పెదగంట్యాడ : ఫైనాన్షియర్‌ వేధింపులు తాళలేక ఓ యువకుడు శనివారం లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడుపూరులో పీత గౌరీశ్వర్‌కుమార్‌ అలియాస్‌ పవన్‌కుమార్‌ (26) తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యాపారం నిమిత్తం ఓ ఫైనాన్షియల్‌ సంస్థలో రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా విధిగా వాయిదాలు చెల్లిస్తున్న అతను ఈ నెల వాయిదా ఇంకా కట్టలేదు. దీంతో ఆ ఫైనాన్స్‌ సంస్థకు చెందిన ప్రతినిధి ఆ యువకునితో దుర్భషలాడాడు.

మనస్తాపం చెందిన ఆ యువకుడు అరుణా థియేటర్‌ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ప్రశాంత్‌ అనే స్నేహితునితో కలిసి శనివారం సాయంత్రం గది అద్దెకు తీసుకున్నాడు. ఆ యువకునికి ధైర్యం చెప్పిన ప్రశాంత్‌ శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో లాడ్జి నుంచి వచ్చేశాడు. కొంత సమయం తర్వాత లాడ్జికి వెళ్లి ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో వెంటనే మృతుని తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనపై సమాచారం అందుకున్న న్యూపోర్టు సీఐ రాము సిబ్బందితో కలసి లాడ్జికి చేరుకున్నారు.

తలుపు గెడ పగులగొట్టి చూసేసరికి గౌరీశ్వర్‌కుమార్‌ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. యువకుడు తన ఫోన్‌లో శ్రీఅమ్మా నన్ను క్షమించు.. నిన్ను బాగా చూసుకుందామనుకున్నాను. అయితే ఏ వ్యాపారం చేసినా నష్టాలు వస్తున్నాయి.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్‌ వస్తుందని, ఆ డబ్బులతో అప్పులు తీర్చి సంతోషంగా ఉండాలశ్రీంటూ టైపు చేసి ఉంచాడు. మృతుని తల్లి పీత లక్ష్మీ ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ రాము ఆధ్వర్యంలో ఎస్‌ఐ మన్మథరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

న్యాయం చేయాలని ఆందోళన
పీత పవన్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడంతో నడుపూరు గ్రామస్తులు భగ్గుమన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్‌ఐలు మన్మథరావు, శ్రీనివాసరావు వారిని వారించారు. ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement