యువతపై దాడిని ఖండిస్తూ సాహితీవేత్తల ‘బొద్దింకల కవన భేరి’
బీచ్రోడ్డు: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన పోరాటం పాలకులకు హెచ్చరిక లాంటిదని సాహితీవేత్తలు, మేధావులు అభిప్రాయపడ్డారు. యువతపై జరిగిన దుర్మార్గపు దాడిని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అరసం, సాహితీ స్రవంతి, విశాఖ రచయితల సంఘం, సహదయ సాహితి, అమరావతి విశ్వసాహితి సంయుక్తంగా ‘బొద్దింకల కవన భేరి’ నిర్వహించాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువతకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, ప్రశ్నిస్తామని, అవసరమైతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. యువత తమ సమస్యలను తామే గుర్తించి, వాటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యమాల స్వరూపం మారిందని, ప్రజాసంఘాలు కూడా ఆ మార్పును గుర్తించాలని సూచించారు. విద్యావ్యవస్థలో వ్యాపార ధోరణి పెరిగిపోవడం ఆందోళనకరమని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, మాజీ యూపీఎస్సీ సభ్యులు ఆచార్య కేఎస్ చలం, అరసం అధ్యక్షుడు ఉప్పల అప్పలరాజు, సాహితీ స్రవంతి అధ్యక్షుడు పొలమరశెట్టి ఫ్రాన్సిస్, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, విశాఖ సాహితి కార్యదర్శి చిన సూర్యనారాయణ, జల్లూరు ప్రభాకర్, పొలమరశెట్టి నిర్మలరాజు, జి. రాజేశ్వరరావు, రవిశంకర్, పతివాడ నాస్తిక్, నాస్తిక సమాజం రామకృష్ణ, బొడ్డు కూర్మారావు, బసు పోతన రాజేష్, కె. చంద్రమోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 20 మంది కవులు కవితా పఠనం చేశారు. కార్మిక నాయకుడు బొడ్డేటి సత్యనారాయణ, చిత్రకారుడు సూర్యారావు, రాంప్రభు తదితరులు కూడా హాజరయ్యారు.


