పెదగంట్యాడ: యారాడ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలు.. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన యెరిపిల్లి రాంబాబు స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు హేమంత్, కార్తీక్(19) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన కార్తీక్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కార్తీక్, అతని స్నేహితుడు కొవిరి అమర్ రోజూ తెల్లవారుజామున యారాడ తీరానికి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఇదే క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 4.15 గంటలకు గంగవరం నుంచి డ్యూక్ బైక్పై యారాడ బయల్దేరారు. భార్గవ్ ఆర్ట్ స్టూడియో సమీపంలో కొండపైకి వెళ్తుండగా సుమారు 4.30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పింది. దీంతో బైక్ నడుపుతున్న అమర్తో పాటు వెనుక కూర్చున్న కార్తీక్ రోడ్డుపక్కనున్న పొదల్లో పడిపోయారు. అక్కడ ఉన్న పెద్ద రాయిపై కార్తీక్ తల బలంగా తాకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అమర్కు తీవ్ర గాయాలు కాగా ప్రాణాపాయం తప్పింది. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన అమర్ను ఆస్పత్రిలో చేర్చారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడి తండ్రి యెరిపిల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు న్యూపోర్టు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో యువకుడికి తీవ్ర గాయాలు


