● తాండూరు ఠాణా ఎదుట ఉద్రిక్తత
● ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
తాండూరు: పట్టణంలోని ఇందిరాచౌక్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అనంతరం తోపులాటకు దారి తీసినట్లు సమాచారం. రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలకు చెందిన నాయకులు పరస్పరం వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఇరువర్గాల నాయకులు కార్యకర్తలు నిమిషాల వ్యవఽధిలోనే పెద్ద సంఖ్యలో పట్టణ ఠాణా వద్దకు చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తాండూరు డీఎస్పీ నర్సింగ్యాదయ్య ఠాణాకు చేరుకుని పోలీసులతో కలిసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆసీఫ్ పోలీస్స్టేషన్లోకి వెళ్లగా, పట్టణ అధ్యక్షుడు నాగరాజ్ను కారులో ఎక్కించి పంపించారు. డీఎస్పీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఠాణా ఎదుటే ఘర్షణకు దిగేందుకు యత్నించిన నాయకులపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ నాగరాజ్పై ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఇందిరాచౌక్కు రావాలని సవాళ్లు
తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజ్, బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆసీఫ్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు చేసుకుంటున్నారు. ఇందిరాచౌక్కు రావాలంటూ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. ఆదివారం పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ హైదరాబాద్లో జరిగిన ధర్నాకు వెళ్లారు. మాజీ కౌన్సిలర్ ఆసీఫ్ ఇందిరాచౌక్కు రావాలంటూ ఫోన్లు చేశాడు. రాత్రి 8 గంటలకు వస్తానంటూ చెప్పిన నాగరాజ్ 9 గంటల సమయంలో ఇందిరాచౌక్కు వచ్చారు. అప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఉండటంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది.


