● దంపతుల దుర్మరణం
● ఒకరి పరిస్థితి విషమం
పరిగి: ముందు వెళ్తున్న సిమెంట్ టిప్పర్ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామం చింతల్చెరువు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. పూడూరు మండలంలోని గంగోనిపల్లి గ్రామానికి చెందిన మున్నూరు నర్సింలు, భార్య అంజమ్మ, తమ్ముడి కుమారుడు అభిరామ్ పనినిమిత్తం నారాయణపేట జిల్లా కోస్గికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని గడిసింగాపూర్ సమీపంలోని చింతల్ చెరువు ప్రాంతానికి రాగానే కారు ముందు వెళ్తున్న ఓ సిమెంట్ ట్యాంకర్ను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగడంతో నర్సింలు అక్కడికి అక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులు అంజమ్మ. అభిరామ్ను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న అంజమ్మ మృతి చెందగా.. అభిరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాస్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


