తాండూరు: పట్టణంలోని యునానీ, ఏఆర్టీ సెంటర్, జిల్లా ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల ప్రాంగణం మురుగు మయంగా మారింది. వీటన్నింటినీ ఒకే భవనంలో నిర్వహిస్తున్నారు. నర్సింగ్ కళాశాల వద్ద మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద తీవ్రమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కళాశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నర్సింగ్ కళాశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ కళాశాల కోసం పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో రూ.కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించారు. కానీ కొడంగల్ మెడికల్ కళాశాలకు కేటాయించారు. మూడేళ్ల క్రితం నర్సింగ్ కశాశాలలో రూ.25 లక్షలు వెచ్చించి వివిధ మరమ్మతు పనులు చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగు పర్చారు. పనుల్లో నాణ్యత లోపించడంతో కొన్నేళ్లకే డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. రెండో అంతస్తు పైనుంచి మురుగు భవన ముఖద్వారం ముందు పడుతోంది. దీంతో కళాశాలలోకి వెళ్లడం కూడా కష్టంగా మారింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.
నర్సింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్ద నిలిచిన మురుగు
అధ్వానంగా నర్సింగ్ కళాశాల ప్రాంగణం
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
ఎక్కడికక్కడ నిలిచిన మురుగు
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు


