పరిగి: క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో పరిగికి పేరు ప్రఖ్యాతులు తేవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ప్రవీణ్రెడ్డి, శివనోళ్ల భాస్కర్లు అన్నారు. స్థానిక బాలాజీనగర్కు చెందిన విశ్వనాథ్గౌడ్, విద్య దంపతుల కూతురు అక్షరశ్రీ ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్కు ఎంపికై న విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం వారు విద్యార్థిని అభినందించి, సన్మానించారు. మారుమూల ప్రాంతంలో ఉంటూ జాతీయ స్థాయికి ఎదగడం సంతోషించదగిన విషయమన్నారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ముకుంద అశోక్కుమార్, రవీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: పట్టణంలోని అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని, అధికారులు స్పందించి వీటిని కాపాడాలని జనసత్తా వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సూరజ్సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ధన్గర్గల్లీ వినాయక్చౌక్లో ఉన్న రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించిన కొందరు వ్యక్తులు, ఇందులో భారీ భవన నిర్మాణాన్ని చేపట్టారన్నారు. స్థానిక కుమ్మరిగల్లిలో సైతం ఎవాక్యూ ప్రాపర్టీ (కాందీశీకుల) ఉందని తెలిపారు. ఈవిషయంపై తహసీల్దార్తో పాటు కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు స్పందించని పక్షంలో న్యాయపోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
పూడూరు: పేద విద్యార్థికి చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి చేయూతనందించారు. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయకూలి సారగళ్ల అంజిలప్ప కూతురు నందిని చదువులో రాణిస్తోంది. లక్ష్యానికి పేదరికం అడ్డు కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఐ.. నందినిని ఠాణాకు పిలిపించారు. కానిస్టేబుల్కు కావాల్సిన ఆర్థిక వనరులతో, స్టడీ మెటీరియల్ అందజేశారు. పలు సూచనలు చేశారు. ఉన్నతంగా రాణించాలని ఆకాక్షించారు. నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఎస్ఐ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఐస్ఐకి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతగిరి: వికారాబాద్ ఏకేఆర్ స్టడీ సర్కిల్ సేవలకు గుర్తింపు లభించింది. ఫిలాంత్రోపిక్ సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఎక్స్లెన్స్– 2026 అవార్డుకు ఎంపికై ంది. ఇటీవల నగరంలోని కళామందిరంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి.. అకాడమి డైరెక్టర్ స్రవంతి రమణకు అవార్డు అందజేశారు.
ధారూరు: ట్రాన్స్ఫార్మర్కు రక్షణ సంగతి ఎలా ఉన్నా.. చుట్టూపెరిగిన పిచ్చిమొక్కలతో ప్రమాదకరంగా మారింది. ఇలా ఉంటే ఏదేని సమస్య, అత్యవసర సమయంలో సరఫరాను నిలిపివేయాలన్నా.. మరమ్మతు చేపట్టాలన్నా విద్యుత్ సిబ్బందికి ఇబ్బంది తప్పదు. మండల పరిధి జీడిగడ్డతండాలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగి అవాంతరాన్ని తలపిస్తోంది. అసలే వానాకాలమని, యంత్రం చుట్టూ పేరుకుపోయిన అపరిశుభ్రత.. పాములు, విష కీటకాలకు నిలయంగా మారిందని, వాటి వలన సిబ్బందికి ప్రాణాపాయం ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ నిర్వహణను గాలికి వదిలివేశారని, సంబంధిత అధికారులు స్పందించి, చీదరను తొలగింపచేయాలని కోరారు.


