అనంతగిరి: రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ హరిప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి రెండు గంటలకు టాటానగర్ యశ్వంతపూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఇంజన్కు గుర్తుతెలియని మహిళ మృతదేహం చిక్కుకొని ఉండటాన్ని లోకో పైలట్ గమనించాడు. ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, చామనఛాయ కలిగి ఉందని, తలపై నలుపు మరియు తెలుపు రంగు జుట్టు పురుషుల మాదిరిగా కత్తిరించి ఉందని తెలిపారు. బాడీని వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని, ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
అదుపుతప్పి లారీ బోల్తా
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని ఉడిమేశ్వరం గేటు సమీపంలో ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. వివరాలు.. తాండూరు– మహబూబ్నగర్ హైవే పనులు కొనసాగుతుండగా, తాండూరు నుంచి కొడంగల్ వైపు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఉడిమేశ్వరం సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తాపడింది. గమనించిన పరిసరవాసులు డ్రైవర్, క్లీనర్ను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్ఐ యాదయ్య తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
ధారూరు: ఇంటి స్థలాన్ని దాయాది ఆక్రమించడంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన శాంత్కుమార్(20) ఇంటి ముందు ఉన్న స్థలాన్ని దాయాది మల్కప్ప ఆక్రమించాడు. ఈ నెల 2న శాంత్కుమార్ గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. మల్కప్ప, మంగమ్మ, మల్లయ్య కలిసి ప్రశాంత్కుమార్, అతని తల్లి భూమని నిర్మలమ్మపై గొడవకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన శాంత్కుమార్ పురుగు మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తల్లి నిర్మలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నమ్మి పెట్టుబడి పెడితే
నట్టేట ముంచారు
మరో పేరుతో హోటల్ నిర్వహణ..
ఏడుగురిపై కేసు
గచ్చిబౌలి: భాగస్వాముల మధ్య విబేధాలు తలెత్తడంతో హోటల్ను స్వాధీనం చేసుకున్న వర్గంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూ.5 కోట్ల పెట్టుబడితో రెస్టారెంట్ ఏర్పాటు చేయగా తమ భాగస్వామి కొత్త పేరుతో నిర్వహిస్తున్నాడని ఎలెవెన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కాంతి దత్ లాల్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. నామి పాటిస్సేరి, దక్షింత పేర్లతో హోటల్ నిర్వహిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవన యజమాని నుంచి 10 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2023లో పాటిస్సేరిలో 35 వాతం వాటా, శ్రీ సమేరా హోటల్ హస్పిటాలిటీలోను 35 శాతం వాటా సౌజన్యకు ఉందన్నారు. ఇతర వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉండగా కుట్ర పూరితంగా వ్యవహరించి లీజును అక్రమంగా రద్దు చేసి, కొత్త లీజు డీడ్లు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. రెస్టారెంట్ ప్రాంగణంతో పాటు, సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. హోటల్ పేర్లను తొలగించి కేఫ్ ప్లైన్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. భాదితుడి ఫిర్యాదుతో సౌజన్య జూపల్లి, అక్షయ్నాగ్ ముని, సుమంత్ మానుకొండ, దీపికా రాజు, సర్ధార్ నౌనిహాల్ సింగ్, రామ రుద్ర నూనె, సునీత నూనైపె కేసు నమోదు చేశారు.


