ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి కంది, పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులు, తీవ్ర వర్షాభావ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి పంటలు సాగు చేయడం మంచిదన్నారు. పత్తి, కంది విత్తనాలు అందుబాటులో ఉంచాలని, పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ను సమర్థవంతంగా వినియోగించేలా రైతులకు సూచనలు అందించాలన్నారు. మల్చింగ్ ద్వారా నేలలో తేమను సంరక్షించాలని, శాసీ్త్రయ పద్ధతుల్లో ఎరువుల వినియోగం, తెగుళ్ల నివారణపై రైతులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి కవిత, ఉద్యానవన శాఖ అధికారి మహమ్మద్ సత్తార్, ఇరిగేషన్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.


