ఆర్డీఓ వాసుచంద్ర
పరిగి: సర్ ప్రక్రియలో నాయకుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి తహసీల్దార్ కార్యాలయంలో ఆయా పార్టీల నాయకులతో సర్ ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు తిరిగి ఇవ్వకుంటే ఓటు హక్కు కోల్పోతారని తెలిపారు. ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్లు అనిల్బాబు, విజయేందర్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన వాయిదా
తాండూరు: పట్టణంలో గురువారం నాటి మంత్రుల పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు రూ.290 కోట్లు మంజూరు కాగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి తదితరులు పనులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశం ఉండటంతో తాండూరు పర్యటనను వాయిదా వేశారు. ఈ నెల 18న వారు రానున్న ట్లు పేర్కొన్నారు.
జేఏసీ ఆవిర్భావ సదస్సును
విజయవంతం చేయాలి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో ఆగస్టు 5న జరిగే బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని జిల్లా నాయకులు శ్రీనివాస్ కోరారు. బుధవారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సదస్సుకు ముఖ్యఅతిథిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ హాజరుకానున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవీందర్, మల్లికార్జున్, శేఖర్, నర్సింలు, వెంకటేశ్, ఎల్లయ్య, అజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
భట్టిని కలిసిన బీఎమ్మార్
తాండూరు: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను బుధవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో చిలుకవాగు ప్రాజెక్టు అభివృద్ధి పనులకు అదనంగా రూ.30 కోట్లు విడుదల చేయాలి, ఆరు విద్యుత్ సబ్ స్టేషన్ల టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉపముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
130 మందికి రేషన్ కార్డులు
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి చెందిన పలువురు కొత్త రేషన్కార్డుకు దరఖాస్తులు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా కొత్త కార్డులు అందలేదు. ఈ మేరకు మంగళవారం మండల పర్యటనకు విచ్చేసిన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి బాధితులు సమస్యను వివరించారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే డీఎస్ఓతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. 130 మందికి నూతన కార్డులు మంజూరయ్యాయని చెప్పారు. సివిల్ సప్లయ్ ఇన్స్పెక్టర్ లాగిన్లో మరో 80 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా రేషన్కార్డు లబ్ధిదారులు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


