వివక్ష లేని సమాజమే లక్ష్యం
● ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
● కలెక్టర్ ప్రతీక్జైన్
అనంతగిరి: సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ స్నేహ మెహ్ర, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలన్న సదుద్దేశంతో ఏటా ఫిబ్రవరి 4న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడాలని, ఏ రూపంలో అన్యాయం జరిగినా సమర్థించరాదన్నారు. అంబేడ్కర్ ఎన్నో విలువలతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని గుర్తుంచారు. రాజ్యాంగ సూత్రాలను సమర్థిస్తూ న్యాయమైన, సామరస్య పూర్వకమైన, సాధికారత కలిగిన తెలంగాణ కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డీఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసుచంద్ర, డీబీసీడీఓ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


