తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,408 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,691 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
21 నుంచి వస్త్రాల ఈ–వేలం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ శారీస్ 132 లాట్లు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877–2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆదాయ పన్ను చెల్లించండి
తిరుపతి అర్బన్: ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ లోకేష్, తిరుపతి ఆదాయపు పన్ను అధికారి వసంతలక్ష్మి తెలిపా రు. శనివారం తిరుపతిలో చాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంలోని వ్యాపారులకు ఆదాయ పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. ఈ నెల 15న రెండవ కంతు కట్టుకునే అవకాశం ఉందని వివరించారు. వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
14న పీజీఆర్ఎస్ రద్దు
తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్తోపాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 14 సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు.
నీళ్ల సీసాలపై ఆరోగ్యశాఖ కొరడా
తిరుమల : తిరుమలలో తాగునీటి గ్లాస్ వాటర్ బాటిళ్లను సరఫరా చేసే కంపెనీలపై ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్న నాలుగు కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిళ్లను ఆరోగ్యశాఖ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్లో తనిఖీలు చేపట్టారు. సదరు వాటర్ బాటిళ్లలోని నీటిలో ఎఫ్ఎస్ఎస్సీఐ ప్రమాణాలకు తగిన విధంగా మినరల్స్ అందుబాటులో లేవని తేలింది. అదేవిధంగా సరైన నాణ్యత లేకపోవడంతో వాటిని తిరుమలకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు టీటీడీ ఆరోగ్యశాఖ డిప్యూటీవో సోమన్నారాయణ తెలిపారు. తిరిగి తగిన ప్రమాణాలను ల్యాబ్ నివేదికలో నిరూపించుకున్న కంపెనీలకు అనుమతిస్తామని తెలిపారు.


