తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్అదాలత్లో 3,442 కేసులు పరిష్కారమైనట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ మీడియాకు తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 249 కేసులు, వ్యాజ్యం వేయని బ్యాంకు, బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 22 కేసులు, మొదటి ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జరిమానా చెల్లించే 1,395 కేసులు, రెండవ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన జరిమానా చెల్లించే 1,776 కేసులు ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తి తెలిపారు. తనతోపాటు ఆ బెంచ్లకు అధ్యక్షులుగా తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లెనిన్ బాబు, మొదటి జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరించారన్నారు.
‘ఆర్ఐఎంసీ’కి 30 వరకే గడువు
తిరుపతి అర్బన్: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) 2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథ్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 6న పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షకు 2013 జూలై 2 నుంచి 2015 జనవరి 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పరీక్షకు మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ ప్రధాన అంశాలుగా ఉంటాయని వివరించారు. అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


