కలిసిరాని నిమ్మ
సైదాపురం: ఎల్నినో ప్రభావం నిమ్మ రైతులను తీవ్ర నష్టాల్లో ముంచేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సైదాపురం మండలంలో నిమ్మచెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. నిమ్మ రైతులు భగీరథయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. చినకు కోసం పరితపించినా చివరకు కన్నీరే మిగులుతోంది. పసిబిడ్డలా పెంచిన చెట్లు తమకళ్లెదుటే నిలు వునా వాడిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది. కండలేరు జలాయశం కూడా అడుగంటడంతో చెరువులు సైతం ఎండిపోతున్నాయి.
ధరలు బాగు.. వర్షాలు జాగు
సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరి, కలువాయి మండలాల్లో సుమారు 25వేల హెక్టార్లులో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా నిమ్మతోటల రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. వేలకు వేలు ఖర్చుపెట్టి బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్తా రూ.25 వేల వరకు పలికినా ఫలితం లేదు. కాలం కలిసిరాక.. చెట్లకు కాయల్లేక దిగాలు చెందాల్సి వస్తోంది.
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు ఆవుల జయరామయ్య. ఊరు సైదాపురం. ఆయన గత 15 ఏళ్లుగా నిమ్మతోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం నిమ్మ ఽకాయల ధరలు ఆకాశాన్ని అంటగా.. చెట్లకు కాయలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా తమ కళ్లెదుటే చెట్లకు సాగు నీరందక ఎండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాక అప్పుల్లో కూరుకుపోయాడు. గత కొద్ది రోజుల నుంచి కాస్తున్న ఎండలకు చెట్ల ఆకులు సైతం ఎండిపోయి రాలిపోవడంతో చూస్తూ కుమిలిపోతున్నాడు.


