గత ఏడాది ఆగస్టు 15న 391 మంది ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు ఈ ఏడాది 156 మంది ఉద్యోగులకు మాత్రమే నేడు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
తిరుపతి అర్బన్: జిల్లాలో ఉత్తమ సేవలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు 391 మందికి అవార్డులను జారీచేశారు. అయితే ఈ ఏడాది 165 మంది ఉద్యోగులకు మాత్రమే అవార్డులను పంపిణీ చేయనున్నారు. అవార్డుల తగ్గింపుపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎంత శ్రమించినా కనీసం గుర్తింపు లేదంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనవసరమైన యాప్లను ఉద్యోగుల నెత్తిన రుద్దడంతో సెలవు రోజులు, పండుగ రోజులు, డ్యూటీ టైమింగ్ పూర్తయిన తర్వాత కూడా పనిచేస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు కాదు అన్ని విభాగాల్లో ఉద్యోగులకు పనిభారం పెంచేశారని చెబుతున్నారు. ఈ అంశంపై సచివాలయం, రెవెన్యూ, అంగన్వాడీ, ఆశావర్కర్లు, ఉపాధ్యాయులు, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులు పలుసార్లు తమకు పని ఒత్తిడి తగ్గించాలంటూ జిల్లా స్థాయి అధికారులకు సైతం వినతి పత్రాలను అందించిన సంగతి తెలిసిందే. అయితే పని ఒత్తిడి పెంచి...అవార్డులకు ఎంపిక చేయకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కార్యక్రమం
తిరుపతి నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే 10 స్టాల్స్ను ఏర్పాటు చేయడానికి ఒక్కో విభాగానికి ఒక్కో స్టాల్స్ బాధ్యతలు అప్పగించారు. 11 అభివృద్ధి శకటాలను ఏర్పాటు చేయనున్నారు.


