తిరుపతి ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ఆ సంస్థ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జీఎం ఏవీ.కుమార్ తెలిపారు. ఈ ఆఫర్లు ఈ నెల 12 నుంచి సెప్టెంబరు 12వ తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు. తిరుపతిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.1కే కొత్త సిమ్తో 24 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందజేస్తున్నట్లు తెలిపారు. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్లో ప్రస్తుతం 412 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా ఇస్తున్నట్లు తెలిపారు. వినోదానికి టాంగో లైవ్ ఎంటర్టైన్మెంట్ యాప్ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 60 ఎంబీపీఎస్ భారత్ ఫైబర్ ప్లాన్ను నెలకు రూ.399 చొప్పున 3 నెలలు అందజేయనున్నట్లు తెలిపారు. 200 ఎంబీబీఎస్ భారత్ ఫైబర్ ప్లాన్తో రూ.1,111కే ఓటీటీ ప్లాన్ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ను అందుబాటులోకి తెచ్చామని, అన్ని పన్నులతో కలిపి ఈ శాటిలైట్ ఫోను ధర రూ.1.34 లక్షలు ఉంటుందన్నారు. మారుమూల గ్రామాల్లోనూ కనెక్టివిటీని కల్పించేందుకు గత 18 నెలల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4 జీ టవర్లను 76 నుంచి 572కు పెంచినట్లు తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 3.6 లక్షల నుంచి 4.4 లక్షలకు, రోజు వారి మొబైల్ డేటా 37 టీబీ నుంచి 47టీబీ వరకు పెరగడంతో పాటు రోజు వారి 10వేల జీబీ అదనపు డేటాను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే పుంగనూరు, పాకాల, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు నార్త్, చిత్తూరు సౌత్ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ మొబైల్ ప్రాంచైజీల ఏర్పాటుకు బీఎస్ఎన్ఎల్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ 4జీ నెట్వర్క్, భారత్ ఫైబర్ను వేగంగా విస్తారణ చేపట్టి డిజిటల్ అంతరాన్ని తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి బీఎస్ఎన్ఎల్ను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీజీఎంలు ఎస్.వెంకోబరావు, పి.జయశంకర్, ఐఎఫ్ఏ జి.ప్రసాద్, ఏజీఎంలు లలిత, శివరామ్తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


