తిరుపతి లీగల్: రెండేళ్లుగా వేర్వేరుగా ఉన్న భార్యాభర్తను ప్రస్తుతం తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి, వైఎస్సార్ కడప జిల్లా జడ్జిగా ఉద్యోగన్నితిపై బదిలీ అవుతున్న జడ్జి రామ్పాల్ కలిపారు. ఈ ఘటన తిరుపతి కోర్టులో చోటుచేసుకుంది. బీ.మాధవి అనే మహిళ తన భర్త బీ.పాల్రెడ్డి పై తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు (ఫ్యామిలీ కోర్టు)లో విడాకుల కేసు దాఖలు చేశారు. దీంతోపాటు ఆమె జమ్మలమడుగు మేజిస్ట్రేట్ కోర్టులో పాల్రెడ్డి పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇంతలో పాల్రెడ్డి తన కుమార్తె బీ.నిహారిక సంక్షేమం చూడ్డానికి సంరక్షకులుగా తనను నియమించాలని ఆయన తిరుపతి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తిరుపతి కోర్టులో పెండింగ్లో ఉన్న విడాకుల పిటిషన్, సంరక్షక గార్డియన్ పిటిషన్లను తిరుపతి మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా న్యాయమూర్తి కేసులను పరిశీలించారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవించడానికి అంగీకరించడంతో వారి మధ్య ఓ అంగీకార రాజీ పత్రం ను రాసుకున్నారు. ఆరు నెలల పాటు ఇద్దరూ కలిసి జీవించాలని, ఆలోపు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినా ఇద్దరూ కలిసి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని రాజీ అంగీకార పత్రంలో రాసుకున్నారు. అలాగే జమ్మలమడుగు కోర్టులో ఉన్న క్రిమినల్ కేసును ఆమె వెనక్కి తీసుకోవడానికి అంగీకారం తెలుపుతూ ఒప్పుకున్నారు. కుమార్తె నిహారికను పాల్రెడ్డికి సంరక్షకుడిగా నియమించడానికి ఆమె ఒప్పుకుంటూ రాజీ పత్రంలో సంతకాలు చేశారు. భార్యాభర్తలిద్దరూ కలవడంతో న్యాయమూర్తి ఇద్దరికీ పుష్ప గుచ్ఛం అందజేసి అభినందించారు. అలాగే న్యాయవాదులు రాజశేఖర్, ప్రవీణ్ ,మహిళా న్యాయవాదిని న్యాయమూర్తి అభినందించారు. రెండు కేసులు రాజీ చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరూ తమ కుమార్తెతో ఆనందంగా వెళ్లడం కనిపించింది.


