తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం .. 2019 జనవరి 9వ తేదీ గంజిగుంట బీట్, నీలాపురం బీట్ ఫారెస్ట్ సిబ్బంది కలిసి గంజిగుంట సెక్షన్, నీతాపురం బీట్, కొత్తకోట దాసరిపల్లి అటవీ ప్రాంతం సమీపంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా, దువ్వూరు మండలం, పెద్దబాకరాపురానికి చెందిన మామిళ్ల రమణారెడ్డి, కొట్టే బాలరంగయ్య మరో ఇద్దరితో కలిసి అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. నిందితులు రమణారెడ్డి, బాలరంగయ్యను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద 295.65 కిలోల 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నేరం రమణారెడ్డి, బాలరంగయ్యపై రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు.


