తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కై ంకర్యాలు, అర్చనలు, ఉత్సవాలలో తెలియక జరిగే దోషాల నివృత్తికి ఆలయ పవిత్రతను పరిరక్షణ కోసం ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం తొలి రోజు శ్రీసీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం శ్రీసీతారామలక్ష్మణులు సర్వాంగ సుందర అలంకరణలో బంగారు తిరుచ్చిపై కొలువై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో బి.నాగరత్న, సూపరింటెండెంట్ కే.శ్రీనివాసులురెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్బాబు పాల్గొన్నారు.


