● టీడీపీ గూండాలకు కొమ్ముకాస్తున్న హోంమంత్రి ● రెండేళ్ల కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు ● తిరుపతి అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ మహిళల ధర్నా
తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లాఠీలతో లాండ్ ఆర్డర్ నడిపిస్తున్నారని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ తిరుపతి నగర బూత్కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయికుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు పూల మాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, దాడులను ఖండిస్తూ ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాన్, హోంమంత్రి అనిత డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేపతబట్టి నినాదాలు మిన్నంటించారు. ఈ సందర్భంగా ముప్పాల సాయికుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ గూండాల దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం గుంటూరులో టీడీపీ గూండాలు విచక్షణ కోల్పోయి నడిరోడ్డుపై ఓ మహిళలను వివస్త్రను చేసి కొట్టిపడేస్తే పట్టించుకునేవాళ్లే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, హత్యాచారాలు జరుగుతున్నా హోంమంత్రి అనిత మహిళగా ఉండి మహిళలకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు.
రాజ్యమేలుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందని సాయికుమారి మండిపడ్డారు. జగనన్న ఐదేళ్ల పాలనలో దిశ, నిర్భయ వంటి చట్టాలను తీసుకురావడంతో మహిళలు నిర్భయంగా తిరగగలిగారన్నారు. మహిళల జోలికి ఎవరైనా వెళ్లాలంటే బయపడేలా చట్టాలను అమలు చేసి మహిళలకు ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు జగనన్న అని కొనియాడారు. చంద్రబాబుకు మహిళలే చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకురాళ్లు గోలి విజయలక్ష్మి, కల్లూరి లక్ష్మి, పుష్పలత, కృష్ణవేణమ్మ, రాణెతమ్మ, మవిత, కుమారి, జ్యోతి, పల్లవి, లత తదితరలు పాల్గొన్నారు.


