
పిచ్చాటూరులో మహిళల పాలముంతల ఊరేగింపు
పిచ్చాటూరు: పిచ్చాటూరు ధర్మరాజు స్వామి తిరునాళ్లలో భాగంగా శుక్రవారం ఉదయం అర్జున తపస్సు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని తాటి చెట్టుపై అర్జున వేషధారు ఎక్కి తపస్సు చేస్తూ నిమ్మకాయలను జారవిడవగా.. వాటిని దక్కించుకోవడానికి మహిళలు పోటీపడ్డారు. అనంతరం గ్రామ దేవత గంగమ్మకు మహిళలు పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు పాలముంతలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ధర్మరాజు స్వామి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సాయంత్రం అర్జునుని ఉత్సవమూర్తిని ట్రాక్టర్పై ఉంచి గ్రామంలో ఊరేగించారు. కంకణ దీక్షాపరులు ఊరేగింపు సేవలో తరించారు. ఏర్పాట్లను సర్పంచ్ కేజీ రోస్రెడ్డి, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు.