● 2028, ఆగస్టు 31 వరకు గడువు ● అన్ని కేటగిరీలకు 60 మార్కులు అర్హత ● వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలి ● ఆఫ్లైన్లోనూ టెట్ను నిర్వహించాలి ● ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇన్–సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు తీర్పు పరిధిలో ఉండడంతో రిటైర్మెంట్కు ఐదేళ్లకు పైగా సర్వీస్లో ఉన్న ఇన్–సర్వీస్ టీచర్లు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే రివ్యూ తీర్పులో టెట్ అర్హత గడువును 2028 ఆగస్టు 31 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. దీని ప్రకారం ఆ తేదీలోపు ప్రతి ఇన్–సర్వీసు టీచరు టెట్లో అర్హత సాధించాల్సిందే.
ప్రత్యేక టెట్కు సానుకూలం
రాష్ట్రంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన వినతులు, సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ప్రత్యేక టెట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఆ లోపే సాధారణ టెట్ పరీక్షకు సంబంధించి నోటిషికేషన్ జారీ కావడంతో ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుతం నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు హాజరవుతున్నారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవే
టెట్ పరీక్షలో సాధారణంగా 150 మార్కులకు గాను ఓసీలకు 90, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరిలకు 60 మార్కులను అర్హతగా నిర్ణయించారు. అయితే ఇన్–సర్వీసు ఉపాధ్యా యులకు టెట్లో అందరికీ సమానంగా అర్హత మార్కులను 60గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్జెక్టు టీచర్లకు వారు బోధించే సబ్జెక్టులోని అంశాలతోనే పరీక్ష నిర్వహించాలని, సాంకేతికత అనుభవం లేని సీనియారిటీ టీచర్లకు ఆఫ్లైన్లో టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. టెట్ రాసే ఇన్–సర్వీస్ టీచర్లకు ఓడీ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.


