Sircilla: Young Man Commits Suicide After Sent Whatsapp Message To Brother - Sakshi
Sakshi News home page

Sircilla: ‘సారీ.. అన్నయ్య మిస్‌ యూ’.. అంటూ మెసెజ్‌ పెట్టి..

Dec 5 2022 4:31 PM | Updated on Dec 5 2022 5:43 PM

Young Man Suicide After Whatsapp Message To Brother At Sircilla - Sakshi

గొడుగు దినేష్‌ (ఫైల్‌), చివరగా చేసిన వాట్సాప్‌ మెసేజ్‌

సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్‌ యూ’ అంటూ మెసేజ్‌ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్‌(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్‌లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్‌ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్‌కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్‌ నిరాకరించారు.

దీంతో దినేశ్, గణేశ్‌లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్‌ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్‌గుట్టకు వెళ్లాడు.

అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్‌కు ఫోన్‌చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్‌ కట్‌ చేశాడు. వెంకటేశ్‌ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్‌ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్‌గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement