
రాష్ట్రంలో పురుషులనుమించిమొబైల్ ఫోన్లు వాడుతున్న మహిళలు
సొంతంగా ఫోన్లు అధికంగా ఉన్నది మాత్రం పురుషుల వద్దే
మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తెలంగాణలోనే ఎక్కువ
రాష్ట్రంలో ఆన్లైన్ బ్యాంకింగ్ వినియోగిస్తున్న 63% మంది
26.4 శాతం మంది యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వాడకం
కాంప్రహెన్సివ్ మాడ్యులార్ సర్వే–టెలికం 2025లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం స్మార్ట్గా దూసుకెళుతోంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని కాంప్రహెన్సివ్ మాడ్యులార్ సర్వే– టెలికం 2025లో వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ ఏడాదే ఈ సర్వే నిర్వహించింది.
ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేలో తేలింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలో పురుషులకంటే మహిళలే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. సొంతంగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నవారిలో కూడా మహిళలే ముందుండటం విశేషం. సర్వేలోని ముఖ్యాంశాలు..
» ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,395 గ్రామీణ, 1,987 పట్టణ ప్రాంతాల్లో 34,950 కుటుంబాల్లోని 1,42,065 మంది అభిప్రాయాలు తీసుకున్నారు.
» 15–29 ఏళ్ల మధ్య వయసు్కల్లో 97.1 శాతం మంది సర్వే జరిపిన రోజు కంటే ముందు మూడు నెలల కాలంలో మొబైల్ ఫోన్ వినియోగించారు. ఇందులో 98 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు ఉన్నారు. 2022–23లో 96.4 శాతం మంది పురుషులు, 91.8 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడినట్టు వెల్లడైంది.
» తెలంగాణలో 98.3 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మొబైల్ ఫోన్ వాడుతున్నారని తేలింది. రాష్ట్ర సగటు 98.4 శాతంగా నమోదైంది. మిజోరం, అండమాన్ నికోబార్, చండీగఢ్, లక్షద్వీప్లో 100 శాతం మంది మొబైళ్లు వాడుతున్నారు. అయితే, వాడుతున్న వారితో పోలిస్తే సొంతంగా మొబైల్ ఫోన్ ఉన్న వారి సంఖ్య తగ్గింది. తెలంగాణలో 87.7 శాతం మంది పురుషులు, 78.3 శాతం మంది మహిళలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.
» దేశవ్యాప్తంగా 70 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. తెలంగాణలో 72.2 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇందులో 79.9 శాతం మంది పురుషులు, 64.9 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో దేశంలో చండీగఢ్ (94.6 శాతం), మిజోరం (92.7 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
» తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 51.9%, పట్టణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే సగటున 63.5 శాతం మంది ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారు. ఇందులో దేశసగటు 48.9 మాత్రమే ఉంది.
» తెలంగాణలో 26.4% (18.9 శాతం మంది గ్రామీణ, 32.3 శాతం పట్టణ) మంది యూపీ ఐల ద్వారా నగదు చెల్లింపులుజరుపుతుండగా, దేశవ్యాప్తంగా ఇది18 శాతం ఉంది.