
ఆలస్యంగా ఫిర్యాదు ∙ వైద్యుడిపై కేసు నమోదు
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు.
ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు.
విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.